టీజీఆర్జేసీ సెట్ రాసే విద్యార్థినులకు డబుల్ చాన్స్

టీజీఆర్జేసీ సెట్ రాసే విద్యార్థినులకు డబుల్ చాన్స్
  • ఒక్క పరీక్షతో గురుకులాలు, కేజీబీవీల్లో అడ్మిషన్
  • స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్  

హైదరాబాద్, వెలుగు: టీజీఆర్​జేసీ సెట్ రాసే విద్యార్థినులకు అడ్మిషన్లలో రెండు ఆప్షన్లు కల్పించాలని సర్కారు నిర్ణయించింది. దీనివల్ల ఒక్క ఎంట్రన్స్ టెస్ట్​రాస్తే.. మెరిట్ ఆధారంగా అటు టీజీఆర్​జేసీ గురుకులాల్లో, ఇటు కొత్తగా ఏర్పాటైన యంగ్ ఇండియా ఇన్‌‌‌‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేజీబీవీల్లో సీటు పొందే అవకాశం దక్కింది. శనివారం వెలుగు దినపత్రికలో ‘ఒకే రోజు రెండు ఎంట్రెన్స్​లా?’ అనే హెడ్డింగ్ తో ప్రచురితమైన కథనంపై విద్యాశాఖ స్పందించింది.

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ టీజీఆర్​జేసీ సెట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏదైనా ఒక పరీక్ష రాస్తే చాలు, వచ్చిన మెరిట్ ఆధారంగా ఈ రెండు రకాల కాలేజీల్లో సీటు పొందే చాన్స్ ఉంటుందని ప్రకటించారు. 

ఇంటర్​తోపాటు పోటీ పరీక్షలకు కోచింగ్​

రాష్ట్రంలోని 93 కేజీబీవీలను ప్రభుత్వం యంగ్ ఇండియా ఇన్‌‌‌‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చింది. ఈ సంస్థల్లో అడ్మిషన్ పొందిన వారికి రెగ్యులర్ ఇంటర్‌‌‌‌తోపాటు ఐఐటీ-, జేఈఈ, నీట్, ఈఏపీ సెట్, క్లాట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్​ఇవ్వనున్నారు. గ్రామీణ విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే ఈ నిర్ణయం వెనకున్న ఉద్దేశమని  ​డైరెక్టర్​ తెలిపారు.

నేడు టీజీఆర్​జేసీ సెట్‌‌‌‌ 

తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలు, ఎక్సలెన్స్​ కేజీబీవీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్​జేసీ సెట్ ఆదివారం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్ష కోసం 317 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 35 గురుకులాలు, 93 కేజీబీవీల్లో  ప్రవేశాల కోసం మొత్తం 76,174 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జామ్​లో వచ్చే మెరిట్ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లను కేటాయించనున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు.

స్టూడెంట్స్​ పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. టీజీఆర్​జేసీ, కేజీబీవీ రెండింటికీ దరఖాస్తు చేసుకున్న వారు తమకు నచ్చిన గ్రూప్​హాల్ టికెట్‌‌‌‌తో పరీక్షకు హాజరుకావొచ్చని, ఫలితాల వెల్లడి సమయంలో బాలికలకు రెండు సంస్థల్లోనూ ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు.